Wednesday, February 19, 2014

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం'

మనిషి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం.

జీవితంలో దాదాపు అన్ని రకాల దశలు దాటి వచ్చి అవసాన దశలో కన్నుమూసిన వారి గురించి బాధపడినా, ఈ భూమ్మీద జీవితాన్ని సంపూర్ణంగా జీవించి నిష్క్రమించారులెమ్మని తలుస్తారు వారితో బంధం ఉన్నవారు. అదే చిన్న వయసులో ఏ జబ్బుల బారినో, అనుకోని ప్రమాదాల బారినో పడి మరణించినవారి గురించి శోకించి శోకించీ చివరికి ఇది కర్మ ఫలితం మన చేతిలో ఏముందిలెమ్మని కాస్త నిబ్బరంగా సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు.

అదే ఒక వ్యక్తి తన ప్రాణాలు తనే నిలువునా తీసేసుకుంటే?

ఆ మరణవార్త తెలిసినవారందరూ ఆ వ్యక్తితో కనీస పరిచయం లేని వారు కూడా కేవలం వార్త విని " అయ్యయ్యో.. అంతటి కష్టం ఏమొచ్చిందో పాపం! బంగారం లాంటి జీవితాన్ని అంతం చేసుకున్నాడు!" అని బాధ పడతారు.
ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని కష్టాలున్నా 'బంగారం లాంటి జీవితం' అనే అంటారు. దానిక్కారణం పుట్టుక అనేది మనకి తెలీకుండా, మన ప్రమేయం లేకుండా ఆయాచితంగా ఈ భూమ్మీద బతకడానికి లభించిన అవకాశం. అసలు ముందు మనం అంటూ ఉంటే కష్టాలో, నష్టాలో వేటినైనా ఎలా ఎదుర్కొనగలమో, ఎలా పరిష్కరించుకోగలమో ఆలోచించి ప్రయత్నించవచ్చు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కష్టాలు ఇవీ.. అని తెలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో "అయ్యో పాపం! ఇంత నరకయాతన అనుభవించాడా! దురదృష్టవంతుడు!" అని జాలి పడి చావు తర్వాత మరణించిన జీవి అస్తిత్వం ఏమవుతుంది అని ఎవరికీ ఇదమిద్దంగా తెలీకపోయినా కూడా అన్ని కష్టాలు అనుభవించిన ఆ జీవికి కనీసం చావుతోనైనా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు.

మరి.. ఒక వ్యక్తి "హక్కుల కోసం, సమాజం కోసం, ప్రభుత్వాన్నో, పార్టీలనో బెదిరించడం కోసం, ప్రజలందరి భవిష్యత్తు కోసమే నా ఈ ఆత్మాహుతి" అంటూ తన ప్రాణాన్ని తృణప్రాయంగా తగలబెట్టుకుంటే?

ఎక్కడో ఒక చిన్న పల్లెలో పగలనకా, రేయనకా ఒళ్ళు గుల్ల చేసుకుని నాలుగు పైసలు సంపాదించి మా పిల్లలు మాలాగా కష్టాల్లో బతక్కూడదు, నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకుని మంచి ఉద్యోగం చేసి దొరబాబులా బతకాలి అని పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి చేయాల్సిన న్యాయం సంగతి మర్చిపోయి ఉద్యమాల కోసం బలిదానం అయ్యే యువకుల చావుల గురించి ఎలా అర్థం చేసుకోవాలి?
ఏదైనా సాధించాలన్న తపన, పట్టుదల ఉన్నవాళ్ళు బతికి సాధించాలి కానీ ఎవడినో బెదిరించడానికి, ఎవరి సిద్ధాంతాలనో గెలిపించడానికి వీళ్ళు చావడం ఏమిటో?

ప్రభుత్వం ఫలానా చెడ్డపని చేసిందంటూ వెంటనే కనిపించిన ప్రభుత్వ కార్యాలయాల మీదా, వాటి ఉద్యోగులైన డాక్టర్ల మీదా రాళ్ళూ రప్పలు విసిరి, ప్రభుత్వ ఆస్తులు అన్న పేరు తగిలించి కనిపించిన బస్సులు, రైళ్ళు తగలబెట్టి, రోడ్ల మీద టైర్లు మంట పెట్టి తమ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాం, వ్యవ్యస్థ మీద తిరుగుబాటు చేస్తూ పోరాడుతున్నాం అనుకునేవారు చేసే పనుల వల్ల ఎవరి ఆస్తికి నష్టం జరుగుతుంది, ఎవరి జీవితాలు స్థంభించిపోతున్నాయి అన్నది ఆలోచించరెందుకో?

కాలేజీల్లో, యూనివర్సిటీల్లో గొప్ప చదువులు చదివి విజ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వ్యవ్యస్థని బాగు చెయ్యడానికి, కన్నవాళ్ళని, ఉన్న ఊరిని, దేశాన్ని ఉద్ధరించడానికి వినియోగించాల్సిన విద్యార్థులు..
"మా చదువులు పూర్తిగా నాశనమైనా పరవాలేదు. స్కూళ్ళు మూసేసినా పరవాలేదు, పరీక్షలు ఆపేసినా పరవాలేదు, కాలేజీలు మానేసి జైల్లో కూర్చున్నా పర్వాలేదు, చివరికి ఏ కిరోసినో, పెట్రోలో పోసుకుని మమ్మల్ని మేము తగలెట్టుకున్నా పరవాలేదు" అంటూ ఆత్మాహుతులకీ, బలిదానాలకి సిద్ధం అవుతుంటే వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవాళ్ళ, ఊరి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో కదా!

ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావు గారు రాసిన నవల 'బలిదానం'. కౌముది మాసపత్రికలో జనవరి 2012 నుంచీ సెప్టెంబర్ 2012 దాకా ధారావాహికగా వచ్చిన ఈ నవల ఇప్పుడు పూర్తిగా e-బుక్ రూపంలో కౌముది గ్రంథాలయంలో లభ్యమవుతోంది.

కేవలం 38 పేజీలు  ఉన్న ఈ చిన్న నవల చదవడం పూర్తయ్యాక చాలా ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ప్రతి నిత్యం పొద్దున్నే పేపర్లో ఇలాంటి వార్త ఏదో ఒకటి చూస్తూనే ఉండటం వల్ల ఈ నవల చదువుతున్నంతసేపు కేవలం ఇదొక నవలే కదా అన్న భావన రాకుండా, నిజంగా ఇలా ఎందరి జీవితాలు నలిగిపోతున్నాయో అనిపించి మనసు భారమవుతుంది. చాలా సహజంగా రాశారు రామకృష్ణారావు గారు.

ఒక ఉద్యమం తప్పు, ఒక పోరాటం తప్పు, సామాజిక స్పృహ ఉండటం తప్పు అని ఎవరూ అనరు కానీ ప్రాణాలు తీసుకోవడం ద్వారా దేన్నో గెలిపించాలన్న భావన పోగొట్టుకుని బతికి పోరాడి ఏదైనా సాధించాలని మన యువత గుర్తిస్తే మన దేశం మరింత బాగుపడుతుందేమో!

పాలగుమ్మి రామకృష్ణారావు గారి నవల 'బలిదానం' ఇక్కడ కౌముది గ్రంథాలయంలో ఉచితంగా చదవొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Saturday, February 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 2

ఆలోచనలు మనసుని ఎంతగా ఉసిగొలిపి గతకాలపు పంజరంలోనే బంధించాలని చూసినా, రెక్కలిచ్చి ఏవో ఊహాలోకాల విహారానికి తీసుకెళ్ళినా, కాలాధిదేవత ఠంచనుగా మళ్ళీ మననితీసుకొచ్చి వర్తమానపు ఒడిలో దిగబెట్టేస్తుంది.​ 
అమెరికా నుంచి బయలుదేరిన మేఘనందనముందుగా అనుకున్న సమయానికన్నా రెండు గంటలు ఆలస్యంగా విమానం దిగింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక ​