Wednesday, March 13, 2013

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా..


ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా.. ఏకాకిని నా ప్రియా..
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా..
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా.. ప్రియా.. ప్రియా..

ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ..


దారులన్నియు మూసె దశ దిశలు ముంచెత్తె..
నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ..
ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల..
తమస్వినీ గర్భకుహరాల..

లోకమంతా పాకినవి పగటి వెలుగులు..
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు.. రాకాసి చీకట్ల మూలుగులు..


ఎపుడు నీ పిలుపు వినబడదో అపుడు నా అడుగు పడదు.. 
ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక నా అడుగు పడదు..

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన కావ్యమౌను మరియు గానమౌను..
నేటి బాధ నన్ను మాటాడగానీని.. ప్రళయమట్లు వచ్చి పడియె పైని..


~~~~~~~~~~~~

ఏ విశేషమూ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతున్న ఓ మనిషి జీవితంలోకి అకస్మాత్తుగా ఓ ఇంతి ప్రత్యక్షమై అతనికే తెలియకుండా అతనిలో దాగున్న ఓ భావకవిని మేల్కొలిపింది. అంతలోనే అంతర్ధానమైపోయిన ఆమె వియోగంతో అతని వేదనలోంచి ఇదిగో ఈ విరహ కావ్యం జనించిందట. ప్రియురాలికై అతగాడు రచించిన ఆ కవితలన్నీటిని ఏర్చి కూర్చి మేఘసందేశం అనే ఖండకావ్యంలా అచ్చు వేయించారట.

అయ్యా కవి గారూ.. మీ కావ్యం గురించి చెప్పండి అని అడిగితే నా ప్రేయసి వల్లనే ఇది ప్రాణం పోసుకొంది కావున నా అప్రాప్త మనోహరికే ఈ కావ్యం అంకితం అని ఇలా చెప్పారుట.

~~~~~~~~~~~~

అది ఒకానొక మలు సందె ఎదుట..
గౌతమీ నది ఇరు దరులొరసి మింటి చాయలను నెమరు వేసుకొనుచు సాగినది..
అపుడు.. అపుడే.... కలిగె నాకొక్క దివ్యానుభూతి.. కలిగె నాకొక్క దివ్యానుభూతి..

శూన్యాకాశము వలె చైతన్యలవము లేని బ్రతుకు దారుల
శోభానన్యంబు ఒక శంపాలత కన్యక తొలివలపు వోలె కాంతులు నించెన్..

అంతరాంతరమున వింత కాంతి నిండి..
ఊహలకు రెక్కలొచ్చి.. ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె..
అలతి కవితలు వెలువడే..
అంతలోన.....
కనుమొరగిచనెమెరపు చీకటులు మిగిలె..
అపుడు ఎలుగెత్తి పిలిచినాను..
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను.. రోదించినాను..
వెదకి వెదకి వేసారితి.. వెర్రినైతి..


ఆశలు రాలి ధూళి పడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు..
వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశము రక్తబిందువులలో రచియించితి నేను.. 
మేఘసందేశము రూపు దాల్చినది నేడు.. ఇది ఏమి మహా కవిత్వమో!

~~~~~~~~~~~~
అంతటి వియోగ బాధ అనుభవించాక కొన్నాళ్ళకి మళ్ళీ ఆ ప్రేమికులిద్దరూ కలుసుకున్నారట. లోకమంతటికీ వారి అనుబంధం ఓ ప్రశ్నార్థకంలా మిగిలిపోయినా వారిరువురూ మాత్రం ఈ లోకాన్ని పూర్తిగా త్యజించి చివరిదాకా తమదైన భావప్రపంచంలో సంపూర్ణంగా జీవించారుట. ఒకే ఆత్మలా జీవించిన వారిరువురూ ఒక్కసారే జంటగా ప్రాణం విడిచారుట.

పూవు తావి వలె పదము భావము వలె కలిసిపోయిన అరుదు జంటలకు ఒక్కటే ప్రాణనాడి..
తనువులు వేరైన గాని బ్రతుకులో మృతిలో ఎడబాటు లేదు..


~~~~~~~~~~~~

ఈ కథేంటో గుర్తొచ్చేసిందా ? :-)
1983
లో దాసరి నారాయణరావు గారి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'మేఘ సందేశం' సినిమా కథ. ఈ సినిమాలో అద్భుతమైన పాటలతో పాటు అందమైన పద్యాలు కూడా ఉన్నాయి. పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ఈ పద్యాలన్నీ సినిమాలో సందర్భానుసారంగా ఏసుదాస్ గారి గళంలో మరింత మధురంగా వినిపిస్తాయి.

గోదారొడ్డున సూర్యోదయాన్ని రెండే వాక్యాల్లో ఎంతందంగా వర్ణించారో చూడండి.

ఉదయగిరి పైన అదిగొ గగనాన కదలె దినరాజు తేరు..
ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి కదలె గోదారి నీరు.. కదలె గోదారి నీరు..

కవిహృదయం గురించి... 

శోకమొకటియె కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ..
కరుణ ఒకటియే కాదు రసము జీవితమున..
కవికి వలయు ఎన్నో వివిధానుభూతులు ఎడద నిండా..


నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై..
నా మన్కియే పూవులున్ కాయల్ పండ్లును నిండు నందనముగా నైనన్.. 
వ్యథావేదనల్ మాయంబై సుఖశాంత జీవనము సంప్రాప్తించి పూర్ణుండనై..
వ్రాయంజాలుదు మానవానుభవదివ్యత్కావ్య సందోహమున్..


~~~~~~~~~~~~

ఆడియోలో విన్న అన్నీ పద్యాలు నేను చూసిన డీవీడీ లో లేవు. కథానుసారం కావాలని వదిలేసారో లేకపోతే ఆ డీవీడీలో లేవో తెలియదు. అలతి అలతి పదాల్లో ఒదిగిన అందమైన కవిత్వం ఏసుదాస్ గారి మధుర గళంలో వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది.